మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు
(18న ప్రముఖ నిర్మాత రామానాయుడు గారి వర్ధంతి సందర్భంగా)
భారతీయ చలన చిత్రరంగంలో డాక్టర్ రామానాయుడిగారికి సుస్ధిరమైన స్థానం ఉంది. తెలుగు, ఇంగ్లీషు, తమిళం, మళయాళం, కన్నడం, బెంగాలీ, ఒరియా,భోజ్పురీ భాషలలో సినిమాలను నిర్మించిన ఏకైక వ్యక్తి డాక్టర్ రామానాయుడు. ఉన్నతమైన వ్యక్తిత్వంతో పాటు సాటి వారికి సహాయం చేయాలనే మనస్తత్వం ఆయన సొంతం. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన మహనీయుడు రామానాయుడు. రామానాయుడుగారి పూర్తిపేరు దగ్గుబాటి రామానాయుడు. ఆయన 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. తండ్రి వేంకటేశ్వర్లు, తల్లి లక్ష్మీ దేవమ్మ. రామానాయుడు రాజేశ్వరిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు సురేష్ బాబు, వెంకటేష్ బాబు అనే ఇద్దరు కుమారులు, లక్ష్మి అనే కుమార్తె ఉన్నారు. గుంటూరు జిల్లాలో బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతరపున లోక్సభకు పోటీచేసి రామానాయుడు విజయబావుటా ఎగురవేసారు. 1999 నుండి 2004 వరకు ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు.
అవార్డులు – పురస్కారాలు
1976లో తాష్కెంట్లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డును రామానాయుడు స్వీకరించారు.
1990లో ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ అసోసియేషన్ రామానాయుడును ఉత్తమ సినీనిర్మాతగా, సినీ పంపిణీదారుగా సత్కరించింది.
1992లో జరిగిన పీర్లెస్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా : 1982 నుండి 1992 వరకు పదేళ్లకాలంలో – దశాబ్డంలోఉత్తమనిర్మాతగా డి.రామానాయుడును సత్కరించారు.
1992లో వంశీ బర్క్లీ ఫిల్మ్ మరియు టివి అవార్డుల కార్యక్రమంలో భాగంగా ” జీవన తరంగాలు ” చిత్రం నిర్మించినందులకు గాను రామానాయుడుకు ఉత్తమ చిత్ర నిర్మాతగా అవార్డును ప్రదానం చేసి సత్కరించారు.
1992లో ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ అసోసియేషన్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ” జీవన తరంగాలు ” చిత్రం నిర్మించినందులకు గాను రామానాయుడుకు ఉత్తమ చిత్ర నిర్మాతగా అవార్డును ప్రదానం చేసి సత్కరించారు.
1992లో ” వంశీ ఆర్ట్ థియేటర్స్ ” సంస్థ ఏర్పాటుచేసిన అవార్డుల కార్యక్రమంలో 1983 నుండి 1992 వరకు పదేళ్లకాలంలో – దశాబ్డంలోఉత్తమనిర్మాతగా డి.రామానాయుడును సత్కరించారు.
1993లో ” సూరిగాడు ” చిత్ర నిర్మాతగా ” ఇండియన్ పనోరమా ” అవార్డును రామానాయుడు స్వీకరించారు.
1993లో ” శ్రీ నటరాజ కల్చరల్ అసోసియేషన్ ” ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ నిర్మాతగా రామానాయుడును సత్కరించారు.
1993లో ” బుల్లితెర టివి హెర్కు ్యలస్ అండ్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో ” బెస్ట్ ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్ ్స ” అవార్డును ఇచ్చి రామానాయుడిని సత్కరించారు.
1994లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ” ఆంధ్రవైభవం ”కు నంది అవార్డు లభించింది.
1995లో ” హేమంత్ ఆర్ట్ ్స ” సంస్ధ తన 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ” ఉత్తమ నిర్మాత ”గా రామానాయుడిని సత్కరించింది.
1996లో సినీరంగానికి అద్భుతమైన సేవలందించినందులకు గాను ” ఇందిరా గాంధీ ప్రియదర్శిని ” అవార్డును రామానాయుడు స్వీకరించారు.
1997లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షులుగా డాక్టర్ రామానాయుడు వ్యవహరించారు.
1997 నుండి 2002 వరకు రెండు మార్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యులుగా డాక్టర్ రామానాయుడు వ్యవహరించారు.
1998లో అత్యధిక సినిమాలను నిర్మించిన నిర్మాతగా గిన్నీస్ బుక్లో రామానాయుడు స్థానం సంపాదించారు.
1999లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షులుగా డాక్టర్ రామానాయుడు వ్యవహరించారు.
1999లో ” బెంగాలీ భాషలో ” నిర్మించిన ” ఆసుక్ ” అనే చిత్రానికి గాను 46వ జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డును రామానాయుడు కైవసం చేసుకున్నారు.
1999-2000 సంవత్సరాలకు గాను విదేశీ వ్యవహారాల కమిటీకి భారతదేశ స్థాయిలో సభ్యులుగా డాక్టర్ డి.రామానాయుడు వ్యవహరించారు.
2000లో జాతీయస్ధాయి కన్సల్టేటివ్ కమిటీకి సభ్యులుగా రామానాయుడు సభ్యులుగా వ్యవహరించారు.
2000 సంవత్సరంలో ” ఫిలిమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ” సంస్థ ” శతాబ్దంలో ఉత్తమ వ్యక్తిత్వం గల వ్యక్తిగా ” రామానాయుడి”ని సత్కరించారు.
2000లో ” వంశీ ఆర్ట్ థియేటర్స్ ” సంస్ధ ” ఎన్టీ ఆర్ లైఫ్ టైమ్ ఎఛీవ్మెంట్ ” పురస్కారాన్ని రామానాయుడికి ప్రదానంచేసారు.
2002లో ఆంధ్రప్రదేశ్ కల్చరల్ ఫిలిం ఫెస్టివల్కు డాక్టర్ డి.రామానాయుడు ఛైర్మన్గా వ్యవహరించారు.
2003లో ” ఫిలిమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ , చెన్నయ్ ” వారు రామానాయుడిని సత్కరించారు.
2003లో రామానాయుడు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కైవసం చేసుకున్నారు.
2005లో ” దాదా సాహెబ్ ” పురస్కారాన్ని రామానాయుడు స్వీకరించారు.
2006లో రఘుపతి వెంకయ్య అవార్డు : 2006లో రఘుపతి వెంకయ్య అవార్డును రామానాయుడు స్వీకరించారు. ఈ పురస్కారాన్ని స్వీకరించిన 28వ వ్యక్తిగా ఆయన చరిత్రపుటల్లోకి ఎక్కారు. అవార్డుతో పాటు బంగారు నందిని, 5 వేల రూపాయల నగదును కూడా స్వీకరించారు.
2011లో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన రచయిత సముద్రాల గురుప్రసాద్ డాక్టర్ డి.రామానాయుడు సినీ జీవితవిశేషాలపై రాసిన ” రంగుల ప్రపంచపు రారాజు ” అనే పుస్తకాన్ని డి.రామానాయుడు హైదరాబాద్లో ఆవిష్కరించి రచయితను ఘనంగా సత్కరించారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ప్రధాన కార్యదర్శి శ్రీ మద్దాళి రఘురామ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ విజ్ఞాన విశారద శ్రీ ఎస్ వి రామరావు తదితరులు పాల్గొన్నారు.
2012లో భారతప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డును 2013 ఏప్రిల్ 5వ తేదీన న్యూఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా స్వీకరించారు.
ఇతర అవార్డులు :
ఎల్ వి ప్రసాద్ గోల్డ్ మెడల్ను, హెచ్ ఎం రెడ్డి అవార్డును, ఉత్తమ నిర్మాతగా ఎల్ వి ప్రసాద్ అవార్డును రామానాయుడు కైవసం చేసుకున్నారు.
” అహ నా పెళ్లంట ” చిత్రానికి గాను ఉత్తమ చిత్ర నిర్మాతగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును రామానాయుడు స్వీకరించారు.
” కథానాయకుడు ” చిత్రానికి గాను ఉత్తమ చిత్ర నిర్మాతగా ” సౌత్ ఇండియన్ జర్నలిస్ట్ ్స అసోసియేషన్ ” రామానాయుడిని సత్కరించారు.
” అభినవ ఆంధ్ర భోజ”కు గాను ఉత్తమ నిర్మాతగా రామానాయుడిని ” శ్రీ గూడవల్లి రామబ్రహ్మం ” అవార్డు వరించింది.
” ఉత్తమ నిర్మాత ” గా పరుచూరి రఘుబాబు స్మారక పురస్కారాన్ని రామానాయుడు స్వీకరించారు.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు రామానాయుడుకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసారు.
ఆంధ్రా కల్చరల్ క్లబ్, చెన్నయ్కు 16 ఏళ్ల పాటు డాక్టర్ డి.రామానాయుడు అధ్యక్షులుగా సేవలందించారు.
రాజ్కమల్ అకాడమీ ఆఫ్ సినీమాటిక్ ఎక్స్లెన్స్ కు గవర్నింగ్ సభ్యులుగా డాక్టర్ రామానాయుడు సేవలందించారు.
రామానాయుడు స్టూడియోస్ :
రామానాయుడు స్టూడియోస్ పేరిట 1989లో ఐదెకరాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్ లో ప్రారంభించారు. 1996లో నానక్రామ్గుడ లో ” రామానాయుడు సినీ విలేజ్ ”ను ప్రారంభించారు.
రామానాయుడు ఛారిటబుల్ ట్రస్ట్ :
రామానాయుడు ఛారిటబుల్ ట్రస్ట్ ను 1991లో స్ధాపించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానాలకు, కమ్యూనిటీ హాల్స్, బస్ షెల్టర్లు నిర్మాణానికి గాను 23 లక్షల రూపాయలను వెచ్చించారు.
చెన్నయ్లో గల ఆంధ్ర కల్చరల్ సెంటర్ నిర్మాణానికి 15 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.
ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాణానికి గాను 13 లక్షల రూపాయల వితరణ అందించారు.
హైదరాబాద్లో మెదక్రోడ్డులో వృద్ధుల ఆశ్రయం కోసం, ఆవాసం కోసం 1.20 కోట్ల రూపాయలను వితరణగా ఇచ్చారు.
ఆంధ్ర, వేంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో పలు విద్యాసంబంధిత కార్యక్రమాలకు 18 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.
తిరుపతిలో ప్రాధమిక పాఠశాలాభివృద్ధికోసం 10 లక్షల 50 వేల రూపాయల సహాయం అందించారు.
బాపట్ల నియోజక వర్గాభివృద్ధికోసం డాక్టర్ రామానాయుడు అహరహం కృషిచేసారు. తన ట్రస్ట్ నిధుల నుండి 10 కోట్ల రూపాయలను వెచ్చించారు. అంతేకాక కారంచేడులో నేత్రవైద్యాలయం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.ఇండోర్ స్టేడియంను ఏర్పాటుచేసారు. పరుచూరులో నీటిపారుదల కోసం కృషిచేసారు.
డాక్టర్ డి.రామానాయుడు విజ్ఞాన జ్యోతి వ్యవసాయ పరిశోధనా కేంద్రంకు 33 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు.
మెదక్జిల్లా నరసాపూర్లో వృద్ధాశ్రమం కోసం ఒక కోటి రూపాయల సహాయం అందచేసారు.
గిరిపుత్రుల సహాయార్ధం అల్లూరి సీతారామరాజు స్మారక రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి 15 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. కారంచేడులో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించారు.
ఫిలింనగర్లో రామానాయుడు కళ్యాణమండపాన్ని, ఓపెన్ ఎయిర్ ధియేటర్ను ఏర్పాటు చేసారు.
చీరాలలో ఎ.కె.పి.కళాశాలలో ఒక ఎడ్యుకేషనల్ బ్లాకును నిర్మించారు.
తిరుపతిలో పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి పెద్దమొత్తంలో విరాళాలను ఇచ్చారు.
కావలి కళాశాలకు తన పేరిట ఒక ఎడ్యుకేషనల్ బ్లాకును నిర్మించారు.
తిరుపతిలోని పురపాలకసంఘం హైస్కూల్కు 10 లక్షల రూపాయలను అందించారు.
కారంచేడులో స్పోర్ట్ ్స స్టేడియం నిర్మాణంకు 17 లక్షల 50 వేల రూపాయల సహాయాన్ని అందించారు.
” ప్రేమించు ” సినిమా విజయం సాధించిన నేపధ్యంలో అంధుల సహాయార్ధం 10 లక్షల రూపాయలను ప్రకటించారు.
పార్లమెంటేరియన్గా రామానాయుడు అందించిన సేవలు :
బాపట్ల నియోజక వర్గ పరిధిలో నిర్మించిన నేత్ర వైద్యశాలకు ఒక కోటిరూపాయల నిధులు మంజూరు
స్పోర్ట్ ్స కాంప్లెక్స్ నిర్మాణంకు 17 లక్షల 50 వేల రూపాయల నిధులు మంజూరు
అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు
కారంచేడు గ్రామాభివృద్ధికి 7 లక్షల రూపాయల సహాయం
బాపట్ల అసెంబ్లీ నియోజక వర్గాభివృద్ధికి 9 లక్షల రూపాయల నిధుల మంజూరు
పొన్నూరు అసెంబ్లీ నియోజక వర్గాభివృద్ధికి 12 లక్షల 65 వేల రూపాయల నిధులు మంజూరు
కూచిపూడి అసెంబ్లీ పరిధిలో 20 లక్షల 86 వేల రూపాయలు, చీరాల అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో 9 లక్షల 20 వేల రూపాయలు, అద్దంకి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో 9 లక్షల 63 వేల రూపాయలు, మార్టూరు అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో 10 లక్షల 63 వేల రూపాయల నిధులను మంజూరుచేసారు.
2015 ఫిబ్రవరి 18వ తేదీన ఆయన కన్నుమూసారు. నేడు ఆ మహనీయుడు లేకున్నా ఆయన కుమారులు సురేష్, వెంకటేష్లు సినీ పరిశ్రమలో రామానాయుడి వారసులుగా తండ్రి గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపచేస్తూనే ఉన్నారు.