నంద్యాల సీఐ సోమశేఖర్రెడ్డి అరెస్ట్
-
పట్టణంలో కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీఎం శ్రీ వైయస్ జగన్ సీరియస్
«ఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోనే బాధ్యులపై చర్యలు
హర్షం వ్యక్తం చేసిన పలు ముస్లిం మైనారిటీ సంఘాలు. ప్రభుత్వ చర్యలపై స్వాగతం
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ తీసి, ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయిన షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య ఘటనను సీఎం శ్రీ వైయస్ జగన్ తీవ్రంగా పరిగణించారు. షేక్ అబ్దుల్ సలాం, అతని భార్య నూర్జహాన్, కుమారుడు దాదా ఖలందర్, కూతురు సల్మా మృతి పట్ల ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
పూర్తి స్థాయి చర్యలకు ఆదేశం
ఈ సంఘటన ఆయన దృష్టికి వచ్చిన వెంటనే, వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి, బాధ్యుల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా డీజీపీ, ఇంటలిజెన్సు చీఫ్లతో మాట్లాడిన సీఎం, ఘటనను సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
లోతైన దర్యాప్తు
ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్లు, బెటాలియన్స్ ఐజీ శంకబ్రత బాగ్చీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ను నియమించారు. వారు వెంటనే నంద్యాలకు వెళ్లాలని ఆదేశించారు. ఈ ఘటనపై ఇంకా హోం మంత్రి, డీజీపీ నుంచి ఆయన నివేదిక కోరారు.
24 గంటల్లోనే చర్యలు
షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యకు బా«ధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏయే సెక్షన్లు..:
భారత శిక్ష్మాస్మృతి (ఐపీసీ) సెక్షన్–34లోని సెక్షన్–323 (ఉద్దేశపూర్వకంగా వేధించడం, బాధించడం), సెక్షన్–324 (మారణాయుధాలు చూపి లేదా ఆ తరహాలో బెదిరించడం), సెక్షన్–306 (ఆత్మహత్యకు పురికొల్పడం) కింద సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్పై కేసులు నమోదు చేశారు.
మైనారిటీల హర్షం:
షేక్ అబ్దుల్ సలామ్ సెల్ఫీ బయటకు వచ్చిన వెంటనే శర వేగంగా స్పందించిన సీఎం శ్రీ వైయస్ జగన్, ఘటనపై దర్యాప్తునకు ఆదేశించడం, ఇద్దరు ఐపీఎస్ అధికారులను సమగ్ర దర్యాప్తు కోసం నియమించడం, ఆ తర్వాత కేవలం 24 గంటల్లోనే ఘటనకు బాధ్యులను గర్తించి, సీఐ, హెడ్ కానిస్టేబుల్ను అరెస్టు చేయడంపై పలు ముస్లిం మైనారిటీ సంఘాలు హర్షం వక్తం చేశాయి. ప్రభుత్వ చర్యలను మైనారిటీలు స్వాగతించారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఐజీపీ శంకబ్రత బాగ్చీ, ఐపీఎస్ అధికారి ఆరిఫ్ హఫీజ్ను నియమించి, ఈ సంఘటనపై దర్యాప్తు చేసి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించిన విషయం తెలిసిందే.