రూ.3.51 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఫారెస్ట్ అధికారి

వీ డ్రీమ్స్ భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖకు చెందిన ఓ అధికారి సహా మరో వ్యక్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. బిల్లులు మంజూరు చేయడానికి రూ.3.51 లక్షల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి పట్టుకున్నారు.

కొత్తగూడెం అటవీ సబ్‌ డివిజన్‌కు చెందిన ప్లాంటేషన్ మేనేజర్ తాడి రాజేందర్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి చెన్నం గోపాలకృష్ణను ఏసీబీ అరెస్టు చేసింది. జామాయిల్ కటింగ్ పనులకు సంబంధించి సుమారు 3,900 టన్నుల నీలగిరి చెట్ల నరికివేతకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇందుకు కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి రూ.3.51 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది.

ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి రాజేందర్, గోపాలకృష్ణలను లంచం తీసుకుంటుండగానే పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ ప్రజలను కోరింది. అలాగే వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్ పేజీ Telangana ACB, ఎక్స్ (ట్విట్టర్) ఖాతా @TelanganaACB ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ హామీ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *