కోర్టులకు స్థలం లేదు కానీ అధికార పార్టీకి మాత్రం ఉందా?!:

వీ డ్రీమ్స్ అనకాపల్లి

తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన భూమి లీజును రద్దుచేసి ఆ స్థలాన్ని న్యాయ శాఖకు అప్పగించాలని ఆల్ ఇండయా లాయర్స్ అస్సో సియెషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీ ఎస్ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన మాటల్లోనే ఆ డిమాండ్ వివరం:
గత అనేక సంవత్సరాలుగా అనకాపల్లి కేంద్రంలో ఉన్న వివిధ న్యాయస్థానాలు ఒక ప్రైవేటు అద్దె భవనంలో నడుస్తున్నాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత కోర్టుల సంఖ్య పెరిగాయి. విద్య కళాశాల కోసం కట్టిన ఈ భవంతిని న్యాయస్థానాలకు అద్దెకు ఇచ్చారు. కళాశాల తరగతి గదులలో కోర్టులను నిర్వహిస్తున్నారు. న్యాయమూర్తి ముందు న్యాయవాదులకు సహితం కూర్చోవడానికి జాగా లేక, సీనియర్ న్యాయవాదులు కూడా గంటల తరబడి నిలబడి వలసి వస్తుంది. పదుల సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు కారిడార్ మొత్తo కోర్టుకు వచ్చిన వారితో నిండిపోతుంది. కోర్టులో పేరు పిలిచిన తర్వాత అనేకమందిని తోసుకుంటూ వాదులు, ప్రతివాదులు, ముద్దాయిలు న్యాయమూర్తి ముందుకు వెళ్ళవలసి వస్తుంది. ఇక మహిళలైతే వారి ఇబ్బందులు చెప్పనలవి కానివి. అనేక సంవత్సరాలుగా న్యాయశాఖ, ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్ కు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు తమకు స్థలం కేటాయించాలని లేఖలు రాస్తూ ఉంది. న్యాయవాదులు కూడా పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చి ఉన్నారు. అయినా స్థలాలు దొరకటం లేదని జిల్లా రెవిన్యూ యంత్రాంగం చెబుతూ వచ్చింది.
కానీ అధికారి తెలుగుదేశం పార్టీ అడిగిన వెంటనే మంత్రివర్గ తీర్మానంతో సంబంధం లేకుండా అనకాపల్లిలో భాగమైపోయిన తుంపాల రెవిన్యూ సర్వే నంబర్ 608-1 లో, రెండు నుండి మూడు కోట్ల విలువైన రెండు ఎకరాల స్థలాన్ని ఒక ఏడాదికి కేవలం 1000 రూపాయలు నగదుతో 33 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీకి జిల్లా కలెక్టర్ భూమిని ఒప్పిగించారు. తాసిల్దార్ కార్యాలయం, రెవిన్యూ డివిజనల్ కార్యాలయం ఒకేరోజు దస్త్రాన్ని పూర్తి చేశారు. నాలుగు రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఈ భూమిని తెలుగుదేశం పార్టీ వారికి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కోర్టులు నిర్మించడానికి తమ వద్ద నిధులు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ స్థలాన్ని ఇవ్వని కారణంగా ఈరోజుకి లక్షలాది రూపాయలు అద్దె చెల్లిస్తూ న్యాయశాఖ తన కోర్టు సముదాయాలను అద్దె భవనంలో నిర్వహిస్తున్నది. కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, కోర్టుకు వచ్చే మహిళా సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమ భవనాలు నిర్మించడానికి స్థలాలు చూపించమని రెవిన్యూ శాఖకు అర్జీలు దాఖలు చేసి ఉన్నాయి. అవన్నీ పెండింగ్లో ఉండగా తెలుగుదేశం పార్టీ వారికి మాత్రం రెండు ఎకరాల స్థలాన్ని నామమాత్ర రుసుముతో జిల్లా కలెక్టర్ అప్పగించారు.
40 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి నిధుల కొరత లేదు. కోట్లకు పడగలెత్తిన వర్గాలు ఆ పార్టీలో ఉండడంతో పాటు ఆ పార్టీకి మద్దతుదారులుగా కూడా ఉన్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ సొంతంగా స్థలం కొనుగోలు చేసుకుని భవనం కట్టుకోగలదు. అయినప్పటికీ అధికారం చేతిలో ఉంది గనుక వివిధ ప్రభుత్వ శాఖలు, న్యాయశాఖ అర్జీలు పక్కనపెట్టి తమకు భూమిని కేటాయింప చేసుకున్నారు. అత్యంత విలువైన ఈ భూమిని కేటాయించడానికి బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ( BSO) ప్రకారం మంత్రివర్గం తీర్మానం అవసరమై ఉన్నది. అయినా జిల్లా కలెక్టర్ గారు నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ వారికి రెండు ఎకరాలు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ లీజు అగ్రిమెంట్ను తక్షణం రద్దు చేసి ఆ స్థలాన్ని కోర్టుల నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము.
లీజ్ అగ్రిమెంట్ను రద్దు చేసి సదరు భూమిని న్యాయస్థానాల నిర్మాణం కోసం అప్పగించాలని కోరుతూ ప్రజాస్వామ్యకువాదులు తమ నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వెంటనే స్పందించి స్వచ్ఛందంగా తమ లీజు ఎగ్రిమెంట్ను వదులుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రజల స్పందనను పట్టించుకోకుండా ముందుకు పోతే ఉన్నత న్యాయస్థానాల ముందు అధికారులు దోషులుగా నిలబడవలసి వస్తుందని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *